శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నాం

శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నాం
  •  ఏడాదిలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని  పూర్తి చేస్తాం 
  • 154.74 కోట్లతో నిర్మాణం
  • 750 మీటర్ల పోడవు 21 మీటర్ల వెడల్పు
  • రాష్ట్ర  మంత్రి గంగుల కమలాకర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని  జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణ పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ అన్నారు.గురువారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్ట పల్లి వద్ద 154.74 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణ పనులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దూరదృష్టితో ఆలోచించి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.  కార్పోరేషన్ పరిదిలో  రైల్వే ట్రాక్ ఉంటే ఖచ్చితంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉండాలని,  అందుకు అనుగునంగా 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో ఆర్వోబిని నిర్మించడానికి శ్రీకారం చుట్టామన్నారు.  బ్రిడ్జి నిర్మాణానికి కావాలసిన సర్వీస్ రొడ్ల నిర్మాణం, స్థలసేకరణ, ఇతర వసతులను కల్పించి ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తిచేయడం జరుగుతుందని వివరించారు.  బ్రిడ్జి నిర్మాణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సర్వే పనులను చేపట్టడం జరుగుతుందని, పనులు సకాలంలో పూర్తిచేసేలా తగినచర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఆర్వోబి నిర్మాణాన్ని 4 వరుసల మార్గంగా తీర్చిదద్దడం జరుగుతుందని,  పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు కనెక్టివిటీ రావడంతో,  ఈ లైన్లో రైళ్ళ రాకపోకలు పెరిగాయని  ప్రధానంగా గూడ్స్ రైళ్ళు ఈ లైన్ గుండా వెళ్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని వెల్లడించారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేలా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణణ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల  విజయ, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మ్పర్సన్ రుద్రరాజు పాల్గొన్నారు.